31-07-2025 01:41:11 PM
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్ గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చెప్పే మాటలకి, నీతులను కట్టుబడి ఉండాలని కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని రాహుల్ గాంధీని కోరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నామన్నారు. పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు మా పార్టీ సిద్ధం అవుతూందని సూచించారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అంతిమంగా సత్యం, ధర్మం గెలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు.