లారీ డ్రైవర్ సజీవ దహనం
- వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో చెలరేగిన మంటలు
- నిర్మల్ జిల్లాలోని మేడిపల్లి జాతీయ రహదారిపై ఘటన
నిర్మల్, జూన్ 11(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని మేడిపల్లి 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున ఓ లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాదు నుంచి హైదరాబాద్ సామాగ్రితో వెళ్తున్న లారీ మేడిపల్లి వద్ద ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
దీంతో సోనాల మండలం కేంద్రానికి చెందిన డ్రైవర్ జువార్ రాజపుత్ర సింగ్( 50) లారీ క్యాబిన్లో ఇరుక్కుని సజీవ దహనమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతర వాహనదారులు లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు బృందంతో అక్కడికి వెళ్లి క్రేన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆ డ్రైవర్ నడుపుతున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి వెనుక నుంచి మరో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు.






