మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
కాగజ్నగర్,(విజయక్రాంతి): కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండె విఠల్ను రాష్ట్ర మాలి సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాలి కులస్తులను ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) జాబితాలో చేర్చాలని కోరుతూ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేశారు.
మాలి కులస్తులు తరతరాలుగా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో జీవిస్తున్నారని, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల్లో తగిన అవకాశాలు దక్కడం లేదని ప్రతినిధులు వివరించారు. ఈ నేపథ్యంలో ఎస్టీ హోదా కల్పిస్తే మాలి కులస్తులకు సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్సీ దండె విఠల్, మాలి కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాలి సంఘం చేస్తున్న ఉద్యమం సమంజసమైందని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులుగా తగిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలి సంఘం నాయకులు, స్థానిక ప్రతినిధులు, మాలి కులస్తులు పాల్గొన్నారు.




