25-09-2025 11:29:58 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 2025-27 సంవత్సరానికి గాను 4 ఎస్.సి., 1 ఎస్.టి., 2 గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం లక్కి డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా ఆబ్కారీ- మధ్య నిషేధ శాఖ అధికారి జ్యోతి కిరణ్ లతో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ సంబంధిత డ్రా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 32 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 4, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 1, సిర్పూర్ - టి మండల కేంద్రంలోని షాపు షెడ్యూల్ కులాల వారికి, రెబ్బెన మండలం గోలేటి, బెజ్జూర్ మండల కేంద్రంలోని షాపు గౌడ కులస్తులకు, కౌటాల మండల కేంద్రంలోని 1 షాపు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు. మద్యం షాపుల కొరకు దరఖాస్తులను అక్టోబర్ 18 వ తేదీ వరకు జిల్లా ఆబ్కారీ- మధ్య నిషేధ శాఖ కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 23వ తేదీన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో లాటరీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.