ఖరీఫ్ నాటికి మారేళ్లపాడు ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
అశ్వాపురం,(విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు కాలువకు అనుబంధంగా నిర్మిస్తున్న మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేయాలని శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ సమీపంలో పనులను పరిశీలించిన ఆయన, అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. ఎండాకాలం అనుకూల సమయం కావడంతో పగలు–రాత్రి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
మే 1 నుంచి ప్రతిరోజు పనులపై నివేదిక సమర్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఈతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే, ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సర్పంచులు సబ్కా పిచ్చయ్య, ఎనిక ఉషారాణి, మచ్చ నరసింహారావు, కోర్సా కృష్ణ, తేళ్లం నాగమణి, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






