calender_icon.png 9 September, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందాలి

09-09-2025 05:13:51 PM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆకాంక్షించారు. ఇందిరా మహిళా శక్తి కింద తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో తేజశ్రీ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్,ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 

జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో  ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమమని వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.