22-10-2025 02:46:38 PM
హైదరాబాద్: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది’ అని మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.
‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహకర, ప్రగతిశీల విధానాలు అభినందనీయమని ఒరికా సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించామని సంజీవ్ గాంధీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంజీవ్ గాంధీ తెలిపారు.