31-05-2025 01:06:48 AM
సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉమ్మడి జిల్లాలో దాన్యం కొనుగోలు, భూ భారతి తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సామాన్యుల సహనానికి పరీక్ష గా మారిపోయింది.
మంత్రులు ఉదయాన్నే కలెక్టరేట్కు చేరుకున్న వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసి లోపటికి ఎవరినీ వెళ్ళనీయలేదు. దీంతో వివిధ పనులు నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు గేటు వద్దే గంటలకొద్దీ ఎదురు చూడవలసి వచ్చింది.
తాము కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చామని కావున ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా తమ పనులు మాత్రమే చేసుకుంటామని లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ప్రాదేయపడ్డప్పటికీ వారు అనుమతించలేదు. దీంతో చేసేది ఏమీ లేక అక్కడే నిలిచిపోయారు. తాము 40 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చామని ముందస్తుగా ఈ విషయంను తెలిపితే తాము ఇక్కడికి వచ్చే వారమే కాదంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు.
ఒకరిద్దరూ పోలీసులను గట్టిగా అడిగే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు మాకు అలా ఆదేశించారని కాబట్టి నిలిపేస్తున్నామని సమాధానం చెప్పినట్టు పలువురు వివరించారు. ఇదిలా ఉండగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టరేట్ కు వచ్చాడన్న విషయం తెలుసుకున్న హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసేందుకు రాగా వారిని కూడా అక్కడే నిలిపివేశారు.
దీంతో వారు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం చేశారు. అయినా వారిని కూడా అనుమతించకపోవడంతో మంత్రి బయటకు వచ్చేంతవరకు ఇక్కడే ఉంటామంటూ ఎదురుచూడడం వారివంతయింది. ఏది ఏమైనా వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సామాన్యులను లోపలికి వెళ్లకుండా గేట్లు వేయడం సరైన విధానం కాదంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.