తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాజకీయంగా ఓర్వలేక తనపై, తన కుమారుడుపై ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఆడియో క్లిప్ లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను 40 ఏళ్లుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ పటిష్టతకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాధించుకున్నానని తెలిపారు. నేను, మా కుటుంబ సభ్యులు ప్రజలతో ఎలా ఉంటామో ఎల్బీనగర్ ప్రజలకు అందరికీ తెలుసన్నారు.
మా రాజకీయ ప్రయాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ మాకు అండగా నిలిచారని, మేము కూడా వారిని అదే గౌరవంతో ఆదరిస్తూ వారికీ అభ్యున్నతికి పాటుపడ్డామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారి వెంట ఉంటామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మూడు రోజులుగా నా గురించి, నా కుమారుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుౠలు జక్కిడి శివచరణ్ రెడ్డిపై సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ల్లో ఏఐ (AI) సాంకేతికతతో రూపొందించిన తప్పుడు వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మమల్ని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. తప్పుడు వీడియోలను బీసీ సామాజిక వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని జక్కిడి ప్రభాకర్ రెడ్డి సూచించారు.






