అమానవీయ ఘటనపై విచారణకు ఆదేశం
- శవాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం సీరియస్
- విచారణ కోసం నేడు జడ్చర్లకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్
- బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఒక శవాన్ని కుక్క పీక్కుతిన్న ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో ఈ సంఘటనపై విచారణ చేయడానికి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.జే. అజయ్ కుమార్ నేడు విచారణకు వస్తున్నారు. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు(Minister Damodar Rajanarsimha) ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అజయ్ విచారణ చేయడానికి ఈరోజు జడ్చర్లకు వస్తున్నారు. ఈ సంఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.




