11 March, 2026 | 6:24 AM

సమన్వయంతో పనిచేయాలి

11-03-2026 12:06 AM

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

కోదాడ, మార్చి 10: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళ వారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 21 వార్డుల్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు క్రమం తప్పకుండా  ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. 

ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు.  అనంతరం జిల్లా పరిషత్ గరల్స్ హై స్కూల్ కట్ట శ్రీ సాయి భవాని మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల సందర్శించి కిచెన్ షెడ్డు, టాయిలెట్స్ వంటశాల, కంప్యూటర్ రూమ్,  స్కూలుకు సంబంధించిన బిల్లులు ఆన్లైన్లో ఎలా చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు  10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మంచి మార్కుల తెచ్చుకోవాలని,  ప్రతి సబ్జెక్టులో నూటికి 70 శాతం మార్కులు రావాలని కలెక్టర్ కోరారు.

విద్యార్థినులకు ఎగ్జామ్ కిట్టు పంపిణీ చేశారు. రెవెన్యూ డివిజన్ అధికారి, తహసిల్దార్ కార్యాలయంలను తనిఖీ చేసి పెండింగ్ ఫైల్స్ క్లియర్, త్రాగునీరు, విద్యా, వైద్యం పై వచ్చిన దరఖాస్తులు 10 రోజులలో క్లియర్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుసుమ కుమారి, రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్య నారాయణ,  మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్,  కోదాడ తహసిల్దార్ వాజిద్, ఎంఈఓ సలీం,  ప్రధానోపాధ్యాయులు సుశీల భాయ్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.