కీసరగుట్టలో నంది శిలలు
స్మారక స్తంభాలు, సతిశిలలు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో షాహికమాన్(Shahi Kaman) దగ్గరలో రెండు చోట్ల రెండ్రెం డు స్తంభాలు, వాటికి రెండు వేదికలు నిర్మించి కనిపిస్తాయి. ఒక జతస్తంభాలవద్ద వీరగల్లుంది. దానిని పరిశీలిస్తే అది ‘సతిశిల’ అని తెలిసింది. ఒక వీరుడు కత్తి, డాలు పట్టుకుని డాకాలు ముందరికి పెట్టి ఉత్తరాభిముఖుడై నిల్చున్నాడు.
అతని వెనక ఇద్దరు స్త్రీలు ఉ న్నారు. ఒక స్త్రీ చేతిలో కమండలం కనబడుతున్నది. ఆ వీరుడు యుద్ధంలో మరణిస్తే అ తనిని అనుసరించి ప్రాణత్యాగం చేసిన ఇద్ద రు స్త్రీలు అతని భార్యలు. వీరునికున్న సిగ, వీరకాసె, వెనక ఉన్న స్త్రీల ఆహార్యాన్నిబట్టి ఆ శిల్పం 14,15వ శతాబ్దాలనాటిదిగా చెప్పవచ్చు.
జతస్తంభాలలో ఒకటవది పైన గుడి విమానం వంటి రూపం చెక్కివున్న స్తంభం, రెండవది పైన నందిని చెక్కివున్నస్తంభం. వీటికి దీర్ఘచతురస్రాకారపు వేదిక రాతిపలకలతో కట్టివున్నది. ఇది ఆ అమరవీరుడు, అ తని భార్యల సమాధి స్థలమైవుంటుంది. వా రు శైవులు కనుక వారి సమాధులపై నంది శిలను నిలిపారు. రెండవ జత స్తంభాల పై భాగంలో నందులు చెక్కివున్నాయి. ఒక స్తం భం మధ్యలో వీరుడు, అతని సతి అర్థశిల్పా లు చెక్కివున్నయి.
ఇది కూడా మరొక సతిశిల. ఇక్కడ కూడా శైవులైన ఆ సతిపతులను సమాధి చేసి, వారి స్మారకంగా నందిస్తంభాలను నిలిపారు. ఆ రెండు స్తంభాల మధ్య ఒక బాణలింగం ప్రతిష్టించబడివుంది. శైవులలో ఆచార్యులు, ప్రభువులైనవారికి నందిశిలల గౌరవం దక్కుతుంది. ఇటువంటి నంది శిలలు త్రిపురాంతకంలో ఉన్నాయి.
కేత్ర సందర్శన: శ్రీరామోజు హరగోపాల్, త్రిభువన విక్రమాదిత్య, నల్ల మధుసూదన్ రెడ్డి, రామకృష్ణ, రమేష్, సాయి చారిత్రక వివరణ: శ్రీరామోజు హరగోపాల్, అధ్యక్షులు, కొత్త తెలంగాణ చరిత్రబృందం






