04-02-2026 02:12:00 AM
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలిక స్థిర ఆదాయం సాధించవచ్చని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ఆమె పాల్గొని రైతులు, అధికారులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.ఈ సందర్భంగాఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు, భవిష్యత్ ఆదాయ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఒకే రోజులో జిల్లాలో 32 మంది రైతుల ద్వారా 110 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు వెల్లడించారు. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని, తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని పేర్కొంటూ రైతులు ఈ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.