17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీ చట్టం

17-06-2026 07:36 PM

- నకిలీ విత్తన వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం..

- సీపీ అంబర్ కిషోర్ ఝా 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా తాండూర్,భీమారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న విక్రేతపై బుధవారం పీడీ చట్టాన్ని అమలు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన వూస సుబ్బారావు రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్, భీమిని,భీమారం, బెల్లంపల్లి-2 టౌన్, తాళ్లగురిజాల, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో వూస సుబ్బారావుపై రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. తాండూర్ సీఐ దేవయ్య,ఎస్‌ఐ ప్రసాద్ నిందితుడికి పీడీ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. సీపీ అంబర్కిషోర్ ఝా మాట్లాడుతూ... వూస సుబ్బారావు 2021 నుంచి 2025 వరకు గత ఐదు సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల రవాణా,నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్ కేసుల్లో పాలుపంచుకున్నాడని తెలిపారు. నిందితునిపై 10-06-2021న పీడీ చట్టం అమలు చేయగా, దానిని ప్రభుత్వం ధృవీకరించిందని పేర్కొన్నారు.

పీడీ చట్టం అమలైన తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జిల్లా, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అమాయక రైతులను నకిలీ పత్తి విత్తనాలను అసలు విత్తనాలుగా నమ్మించి మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి రైతులను మోసం చేస్తున్నాడని తెలిపారు. ఏడాది వ్యవధిలో రెండుసార్లు పట్టుబడినట్లు వివరించారు. నకిలీ విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకోకుండా కొనసాగితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల తయారీ, అక్రమ సరఫరాకు పాల్పడిన నేరస్తుడిపై పీడీ చట్టం అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య,ఎస్‌ఐ ప్రసాద్‌లను సీపీ అభినందించారు.