డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
మెట్పల్లి,(విజయక్రాంతి): ప్రతి వర్షాకాలంలో పట్టణ వాసులకు ఎదురవుతున్న డ్రైనేజీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మున్సిపల్ యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది అని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని బాలకిషన్ నగర్ ప్రధాన రహదారిపై మురికి కాలువ నీరు సజావుగా వెళ్లడానికి వీలుగా నిర్మించనున్న నూతన కల్వర్టు పనులకు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఘనంగా భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి స్థానిక ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి, డ్రైనేజీ నీరు సజావుగా సాగిపోయేలా ఈ కల్వర్టు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ గుడికందుల అజయ్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






