calender_icon.png 18 June, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలో సెటిల్‌మెంట్లకు అడ్డగా మారిన పోలీస్ స్టేషన్లు

18-06-2025 03:41:53 PM

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. తన భూమిని కబ్బా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని కేటీఆర్ సిరిసిల్లలో పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం, న్యాయ పోరాటం చేస్తాం, కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిల్లు చేయడంతో పాటు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో సెటిల్‌మెంట్లకు పోలీస్ స్టేషన్ లు అడ్డగా మారాయని విమర్శించారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే మృతునిపై ఉల్టా కేసు బనాయించి వేధించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్ లో పోలీసులు దూరి సెటిల్‌మెంట్ లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని ఎవరిని వదిలి పెట్టమని హెచ్చరించారు.

తాము అధికారంలో ఉన్న  పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు. మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య, అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలం అయిందన్నారు. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనపడిన లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరో వైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారని స్పష్టం చేశారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. 

పార్టీలో నిబద్ధత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని వివరించారు. ఈరోజు కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.