18-06-2025 04:04:31 PM
మహబూబాబాద్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Department) వలకు విద్యుత్ శాఖ(Electricity Department) ఉన్నత స్థాయి అధికారి చిక్కారు. మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ (Mahabubabad District Electricity Department Superintendent Engineer)గా విధులు నిర్వహిస్తున్న జే.నరేష్ ఓ గుత్తేదారుకు 20 లక్షలకుపైగా విలువైన పనులకు అనుమతి ఇవ్వడానికి రూ.1 లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ కురవి మధ్యలో విద్యుత్ లైన్ మరమ్మత్తులు, మెయింటెనెన్స్ పనులు చేపట్టడానికి జిల్లాకు చెందిన క్లాస్ 1 కాంట్రాక్టర్ 20 లక్షల లోపు పనులు చేపట్టారు.
పనుల అంచనా దాటిపోవడంతో ఎన్పీడీసీఎల్ ఏఈ, డీఈలు సంతకం చేసి పరిమితి పెంచడానికి ఎస్ఈ అనుమతి కోసం ఫైల్ పంపారు. అయితే పనులకు సంబంధించిన ఫైల్ పై ఎస్ఈ నరేష్ సంతకం పెట్టకుండా పక్కకు పెట్టిండని చెప్పారు. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ ఎస్ఈ నరేష్ వద్దకు పలుమార్లు వెళ్లి అడగగా, తనకు రూ.1 లక్ష లంచంగా ఇవ్వాలని, లక్షఇస్తే తప్ప సంతకం చేయనని చెప్పారు. అయితే అంత ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ ఎస్ఈ నరేష్ కు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని, దీనితో ఈనెల 14న రూ.20 వేలు నరేష్ కు ఇచ్చాడన్నారు.
మిగిలిన రూ.80 వేలు తెచ్చి ఇవ్వాలన్నప్పుడే ఫైలుపై సంతకం చేస్తానని చెప్పడంతో అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీస్ కు వచ్చి విషయాన్ని చెప్పాడన్నారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఇవాళ మహబూబాబాద్ పట్టణంలోని తన ఇంటి వద్ద కాంట్రాక్టర్ నుంచి ఎస్ఈ నరేష్ రూ.80 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్ఈ నరేష్ ను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరు భయపడకుండా నేరుగా 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.