19-06-2025 12:23:47 AM
యువతకు నూతన దిశానిర్దేశం చేస్తున్న జేఏసీ
హుస్నాబాద్, జూన్ 18 : మాదక ద్రవ్యాల బారి నుంచి యువతను కాపాడడానికి, బెట్టింగ్, లోన్ యాప్ల ఉచ్చు నుంచి దూరంగా ఉంచడానికి జేఏసీ, మహిళా సంఘాలు సంయుక్తంగా ‘డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర‘ను విజయవంతంగా నిర్వహించాయి. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి, పందిల్ల, కూచనపల్లి, పొట్లపల్లి, మడద, రాములపల్లిలో జరిగిన ఈ యాత్రకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు.
సాంకేతికంగా ఎంతో ప్రగతి సాధించినప్పటికీ, ఆత్మస్థైర్యం, నైతికత విషయంలో వెనుకబడుతున్నామని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలో డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో, క్షణికావేశాలతో, క్షణిక సుఖాల కోసం యువత డ్రగ్స్, బెట్టింగ్ లోన్స్, ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తమ విలువైన జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా కుంగిపోవడమే కాకుండా, అనారోగ్యం, అప్పులు, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యల్లేని సమాజం కావాలి
యువత తమ ఉజ్వల భవిష్యత్తు కోసం డ్రగ్స్, బెట్టింగ్ లోన్స్, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని, తమ మిత్రులను కూడా ఈ వ్యసనాల బారి నుంచి రక్షించడానికి చైతన్యం చేయాలని పోరు యాత్ర పిలుపునిచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా, ఆత్మహత్యలు లేని నియోజకవర్గంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులు తమ బాధ్యతగా ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నట్టే ఇప్పుడు మగ పిల్లల భవిష్యత్తుపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఈ యాత్రలో జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్లు మేకల వీరన్న, డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాశ్, ఏపీఎం అంబాల భిక్షపతి, సీసీలు రవీందర్, అశోక్, జేఏసీ మహిళా నాయకురాలు కోడూరి శ్రీదేవి, మాజీ కౌన్సిలర్ దండి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.