చెత్తను ఊడ్చి.. చేత పట్టి..
స్వయంగా పారిశుద్ధ్య పనులు చేపట్టిన మున్సిపల్ వైస్ చైర్మన్
షాద్నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో(Praja Palana–Pragati Pranalika) అందరూ భాగస్వాములు కావాలని షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ పిలుపునిచ్చారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని 14 వ వార్డులో ప్రగతి ప్రణాళిక చర్యలలో భాగంగా ఆయన స్వయంగా పరిశుద్ధ కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు. సిబ్బందికి ప్రోత్సాహకరంగా వైస్ చైర్మన్ మోహన్ స్వయంగా చెత్తను తొలగించారు తన చేతితో చెత్తను తీసిపారేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ మాట్లాడుతూ.. వివిధ వార్డు పారిశుద్ధ్య కార్యక్రమాలు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పనులను తనతో సహా అందరూ పర్యవేక్షించాలని పలువురు అధికారులకు, సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో పాలకమండలి సభ్యులు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రహదారులపై చెత్త పేరుకుపోకుండా చూడాలని, డ్రైనేజీ కాలువల్లో మట్టిని ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలను గుర్తించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రాము, గోపాల్,, నందిగామ శ్రీశైలం, శ్రీదేవి, వార్డ్ ఆఫీసర్ అనూష, అంగన్వాడి టీచర్ శోభ తదితరులు పాల్గొన్నారు..




