20-06-2025 01:19:12 AM
టెల్ అవీవ్/టెహ్రాన్, జూన్ 19: ఇరా న్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరులోకి అమెరికా అడుగుపెట్టనుంది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనివ్వనప్పటికీ దాడి కి సంబంధించి ఆయన పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు ట్రంప్ ప్రైవేటుగా అంగీకరించారని.. అయితే తుది ఉత్తర్వు లు మాత్రం ఇంకా ఇవ్వలేదని వైట్హౌస్ లో వర్గాలు పేర్కొన్నాయి.
ఇరాన్ అణు కార్యకలాపాలను వదులుకుంటుందేమోనని అమెరికా వేచి చూస్తున్నట్టు సమాచా రం. ట్రంప్ సూచనలతో ఇప్పటికే బంకర్ బస్టర్లు, బ్యాటిల్ షిప్స్, బాంబర్లు, సైనిక దళాలను, యుద్ధ విమానాలను, రీఫిల్లింగ్ విమానాలను పశ్చిమాసియాకు పెద్ద ఎత్తున తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్లోని అమెరికా పౌరులను తరలించే ప్రక్రియను ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించడం చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రమవ్వనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక యుద్ధంలో ఏడో రోజు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలోని బీర్షెవాలోని సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 47 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఆసుపత్రి నుంచి చాలా మందిని వేరే చోటికి తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.
ఇరాన్ ఈ దాడిలో డజన్ల కొద్ది బాలిస్టిక్ మిసైల్స్ను వాడటంతో.. అవి చాలా వరకు పౌర నివాసాలు, కార్యాలయాలపై పడ్డాయని సైన్యం తెలిపింది. ఘటనా స్థలం నుంచి దట్టమైన నల్లటి పొగలు, పగిలిన కిటికీ అద్దాలు కనిపించాయి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్.. ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ అణు రియాక్టర్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం ఉత్పత్తికి ఈ రియాక్టర్ కీలకమైనది.
అయితే దాడికి ముందే ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయించడంతో రేడియేషన్ ప్రమాదం తప్పిందని ఇరాన్ తెలిపింది. ఇప్పటివరకు పరస్పర దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య 639కి పెరగ్గా.. 1329 మంది గాయపడినట్టు వాషింగ్టన్ ఆధారిత ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్’ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్లో 24 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై దాడికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఖమేనీ పేరు ఉనికిలో ఉండటానికి వీలు లేదు’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా.. ‘ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పిరికి పందలా బంకర్ కింద దాక్కొని ఇజ్రాయెల్ ఆసుపత్రులపై, నివాస భవనాలపై క్షిపణి దాడులు చేయిస్తున్నాడు.
ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. ఖమేనీ దీనికి జవాబుదారీ. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ఆదేశాల ప్రకారం ఐడీఎఫ్ చేయాల్సిందంతా చేస్తోంది. ఇజ్రాయెల్కు ముప్పు తొలగించడానికి.. అయతొల్లా ఖమేనీని అణగదొక్కడంతో పాటు.. ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రతను పెంచాలని ఆదేశించాము.’ అని కాట్జ్ పేర్కొన్నారు.
అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పై దాడులు..
ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు చేసింది. అరాక్ రియాక్టర్ మొత్తం ధ్వంసమయ్యే వరకు దాడులు జరుపుతామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి.
అరాక్ హెవీ వాటర్ రియాక్టర్.. టెహ్రాన్కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హెవీ వాటర్ను న్యూక్లియర్ రియాక్టర్లు చల్లబర్చేందుకు ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియంలో ఫ్లుటోనియం ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. 2015లోనే ప్రపంచ దేశాలతో కలిసి ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ ఒప్పందానికి అనుగుణంగానే 2019లో హెవీ వాటర్ రియాక్టర్ సెకండరీ సర్క్యూట్ను టెహ్రాన్ ప్రారంభించింది. పరిమిత సంఖ్యలో ప్లూటోనియం ఉత్పత్తి చేయాల్సి ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఇరాన్ ఉత్పత్తిని పెంచుతున్నట్టు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) తెలిపింది.
హర్మూజ్ జలసంధికి ఇరాన్ బ్రేక్..
యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధిని మూసివేసే అవకాశం ఉందని వెల్లడించింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ జలసంధిని మూసేయడం కూడా ఒక మార్గమని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు బెహ్నాం సయిదీ గురువారం పేరొకన్నారు.
ప్రపంచ చమురు మార్కెట్కు హర్మూజ్ జలసంధి జీవనాడి. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం మధ్య 33 కిలోమీటర్లు ఇరుకైన జలసంధి ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతోంది.
బుషహెర్ అణు కేంద్రంపై దాడులు ఆపాలి: రష్యా
ఇరాన్లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న నేపథ్యంలో రష్యా స్పందించింది. తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది. పర్షియన్ గల్ఫ్లోని బుషెహర్ ప్రాంతంలో ఈ అణు విద్యుత్ కేంద్రం ఉంది. టెహ్రాన్ నగరానికి 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నిర్మాణంలో ఇరాన్కు రష్యా సాయమందించింది.
రష్యాలో ఉత్తత్పి అయిన యురేనియం ఈ అణు విద్యుత్ కేంద్రానికి ఇందనంగా ఉపయోగపడుతోంది. ఇరాన్ విషయంలో అమెరికాకు రష్యా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్పై సైనిక చర్యలకు దిగవద్దని అమెరికాకు సూచించింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రానుందనే ఊహాగానాల నేపథ్యంలో రష్యా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
అణుచర్చలు జరపనున్న ఇరాన్
ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జెనీవా వేదికగా శుక్రవారం యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలతో అణుచర్చలు జరపనుంది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ధ్రువీకరించారు. ఇరాన్ అణుకార్యక్రమం, ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపిన తర్వాత ఈ భేటీ ఖరారైంది.