20-06-2025 01:27:39 AM
కేంద్ర జల్శక్తి మంత్రి పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ వినతి
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల నకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఙప్తి చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్-1980(జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం వ్యవహరిస్తోందని కేంద్రమంత్రికి తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం సమావేశమయ్యారు.
బనకచర్ల ప్రాజెక్టు అను మతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రాతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని, జీడబ్ల్యూడీటీ-1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు.
2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకా రం ఏ రాష్ర్టంలోనైనా నూతన ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే..ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలన్నారు. కానీ, బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని కేంద్రమంత్రికి సీఎం రేవంత్రెడ్డి తెలియజేశారు.
బనకచర్ల విషయంలో ఏ నిబంధనలు పాటించని ఆంధ్రప్రదేశ్, వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంత రకరమని జల్శక్తి మంత్రితో సీఎం పేర్కొన్నారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే..
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సల హా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవ రం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలియజేశారు. జీడబ్ల్యూడీటీ -1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మా ర్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని..
తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు సీఎం వివరించారు. జాతీయ ప్రాజె క్టు అయిన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘిం చకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవ రం--బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇ చ్చే ఇచ్చంపల్లి--నాగార్జునసాగర్ అనుసంధా నం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని కేంద్ర మం త్రికి సీఎం, రాష్ర్ట మంత్రి తెలిపారు.
కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ -2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్రమంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితు ల్లోనూ రాజీపడ బోమని, అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నిస్తామని సీఎం కేంద్ర మంత్రి పాటిల్కు తెలియజేశారు. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం స్పష్టం చేశారు.
మేం1500 టీఎంసీలు వాడుకునేలా అనుమతులు ఇవ్వండి..
తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణానదిలో 500టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1,500టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని..ఆ తర్వాత ఏపీ చేప్టటే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై అలసత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పం దిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మా త్రం అలసత్వం ప్రదర్శించడం తగదని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్, రాష్ర్ట నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
గోదావరి-బనకచర్ల చట్టవ్యతిరేకమైన ప్రాజెక్టు అని, బనకచర్లపై ఆందోళనలను కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు వివరించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో తమ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ తమకు అందలేదని కేంద్రమంత్రి తెలిపారని, త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామన్నారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్తో పెన్నా బేసిన్కు నీరు తీసుకెళ్లొచ్చని, ఇచ్చంపల్లి- సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు సిద్ధమని చెప్పామన్నారు.
త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పాటిల్ హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతులు లభించలేదని, ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులిస్తున్నారని చెప్పామన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరమన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని, పాలమూరు-రంగారెడ్డికి, సమ్మక్క సారక్క, తుమ్మడిహట్టికి కేటాయింపులు చేయాలని కోరామని తెలిపారు.