20-06-2025 01:22:01 AM
నిరుద్యోగ గణాంకాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): సాధారణంగా దేశవ్యాప్తంగా నిరు ద్యోగిత రేటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ నివేదికలను త్రైమాసిక, వార్షిక పద్ధతిలో విడుదల చేసేవారు. ఇక నుంచి నెలల వారీగా విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణ యం తీసుకుంది. దేశంలో నిరుద్యోగ గణాంకాలను కేంద్రం తొలిసారిగా ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసింది.
తాజా ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ ప్రకారం ఏప్రిల్లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. పట్టణాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండగా, యువతలో నిరుద్యోగిత రేటు 13.8 శాతంగా ఉంది. 15 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనేది తెలియజేయడమే లక్ష్యంగా కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది. కరెంట్ మంత్లీ స్టేట స్ విధానంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 15ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2025, ఏప్రిల్లో 5.1 శాతంగా నమోదైంది.
పట్టణాల్లోనే అధికం..
తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 4.5 శాతం ఉండగా, పట్టణ కేంద్రాల్లో 6.5 శాతంగా నమోదైంది. ఈ ఏడాదిలో మొదటిసారి నెలవారీ బులెటిన్ రూపంలో నిరుద్యోగ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ గణాంకాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై వేర్వేరు వివరాలను పొందుపరిచారు. 15 సంవత్సరాలు పైబడిన పురుషుల్లో నిరుద్యోగిత రేటు 5.2 శాతంగా ఉండగా, అమ్మాయిల్లో అది 5.0 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 4.9 శాతంగా ఉంటే, మహిళల్లో 3.9 శాతంగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో మహిళల్లో 8.7 శాతం, పురుషుల్లో 5.8 శాతం నిరుద్యోగులు ఉన్నట్టు నివేదికలో స్పష్టమైంది.
యువ నిరుద్యోగుల 13.8 శాతం..
దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు నిరుద్యోగులపై సర్వే చేపట్టగా యువ నిరుద్యోగులు 13.8 శాతం ఉన్నట్టు వెల్లడైంది. విడివిడిగా పరిశీలిస్తే పట్టణాల్లో 23.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10.2 శాతంగా ఉన్నారు.. గ్రామీణ మహిళల్లో 14.4 శాతం, పురుషుల్లో 13.6 శాతం యువ నిరుద్యోగులున్నారు. 15 ఏళ్లు, ఆపై వయసున్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఏప్రిల్లో 55.6 శాతంగా నమోదైంది.
ఇది గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం, పట్టణాల్లో 50.7 శాతంగా కనిపించింది. మొదటిసారి నెలవారీగా నిర్వహించిన నిరుద్యోగ రేటు సర్వేలో 7,500 ప్రాంతాలను నమూనాగా తీసుకొని, 89,434 నివాసాల్లో సర్వే చేపట్టారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 49,323 మందిని, పట్టణ ప్రాంతాల్లో 40,111 మందితో మొత్తం 3,80,838 మందితో సర్వే చేపట్టి నివేదికను రూపొందించారు.