17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రజాపాలనకు ప్రజామోదం

14-02-2026 01:48 AM

అభివద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తోందని, కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిందని ఆయన చెప్పారు.

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లైందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వట్టి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత బస్‌ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన నిరుపేద మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పథకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయని స్పష్టం చేశారు.

సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని వెల్లడించారు.

పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్‌నగర్, నేరేడుచర్లతో పాటు కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోమారు రుజువైనందని స్పష్టం చేశారు.

ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని, అందుకు తోడ్పాటునందించిన ఆయా పురపాలక సంఘాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరిగిన పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు మరోసారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని నిరూపించారని పేర్కొన్నారు.