14-02-2026 01:46:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ముమ్మాటికీ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలమని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పార్టీ పట్ల కార్యకర్తలకున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అం కితం’ అని సీఎం తెలిపారు. ‘రాష్ట్రంలోని రెండేళ్ల ప్రజాపాలన, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచస్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు.
ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’ అని సీఎ రేవంత్రెడ్డి పేర్కొన్నారు.