19-06-2025 01:17:44 AM
హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నాయకులు, పాపులర్ హీరోయిన్లు, ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి సేకరించిన ఆడియో క్లిప్లను ‘డార్క్ వెబ్’లో అమ్మకానికి పెట్టినట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది.
ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న ఓ అధికారి ఈ ఆడియోలను అమ్ము కున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిట్కాయిన్ల రూపంలో పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందని, ఇప్పటికీ దుబాయ్, డల్లాస్ వంటి అంతర్జాతీయ కేంద్రాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్, డేటా విక్రయం కొనసాగుతోందని తీవ్ర చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజమో కానీ, కేసు విచారణ కీలకదశలో ఉన్న సమయంలో వైరల్ కావడం అటు టాలీవుడ్, ఇటు రాష్ర్ట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సిట్ కార్యాలయానికి క్యూకడుతున్న బాధితులు..
ఈ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితులకు సిట్ అధికారులు సమాచారం అందిస్తుండటంతో, తమ వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తో పాటు 20 మంది వరకు సాక్షులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం దర్యాప్తు బృందం ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్రెడ్డి సిట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది ఫోన్లు ఒకేసారి ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్లు ట్యాప్ అయిన వారిని బాధితులుగా గుర్తించి, వా రిచ్చే వాంగ్మూలాలను సాక్షులుగా నమోదు చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా పెద్ద సంఖ్యలో బాధితుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
వాంగ్మూలం ఇవ్వనున్న సీఎం కుటుంబసభ్యులు..
తన ఫోన్లతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించిన సంగతి తెలసిందే. ఈనేపథ్యంలో రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభాకర్రావు, ప్రణీత్రావు విచారణ..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయని సిట్ వర్గాలు తెలిపాయి. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్, నిందితులను ప్రశ్నిస్తోంది. మంగళవారం ప్రభాకర్రావు విచారణ జరగాల్సి ఉండగా, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండటంతో ఆయన విచారణ బుధవారానికి వాయిదా పడింది.
మరోవైపు బుధవారం సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావు పలు డాక్యుమెంట్లతో సహా జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ను ప్రణీత్రావు లీడ్ చేశారని, అనేక మంది రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్రావును మరింత లోతుగా విచారించారు. ఇప్పటికే పలుమార్లు ప్రణీత్రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే.
హార్డ్డిస్కుల ధ్వంసంపై దృష్టి..
ఈ కేసులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన హార్డ్డిస్క్లను ధ్వంసం చేయడం ఎంతో కీలకంగా మారింది. ఎవరు హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారు? ఈ విషయంలో ఎవరి పాత్ర ఉంది? అనే సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా, ప్రభాకర్రావు నుంచి సరైన సమాధానం రావడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో గురువారం ప్రణీత్రావును విచారించి కీలక వివరాలు రాబట్టాలని సిట్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్రావు, ప్రభాకర్రావు పాత్రలపై మరింత లోతుగా విచారణ జరిపి వీలైనంత త్వరగా వీరిద్దరిపై చార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ కృతనిశ్చయంతో ఉంది.