19-06-2025 01:22:06 AM
మహిళా నేత అరుణ, మరో సభ్యుడు అంజు కూడా..
హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. బుధవారం తెల్ల వారుజామున మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య భీకర పోరు జరిగింది. కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్- ఒడిశా బార్డర్ (ఏవోబీ) స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు రవి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ, పార్టీ సభ్యుడు అంజు మృతిచెందారు.
ఏపీలోని రంపచోడవరం-మారేడుమిల్లి అటవీప్రాంతంలోని కింటుకూరులో మావోయిస్టు పార్టీ అగ్రనేతల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న ఏపీ పోలీసు ఉన్నతా ధికారులు అక్కడ భారీగా గ్రే హౌండ్స్ బలగాలను మోహరింపజేశారు. బలగాలు అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ చేపడుతుండగా, వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు.
అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య సుమారు అరగంట పాటు భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతానికి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతులను మావోయిస్టు పార్టీ అగ్రనేత గాజర్ల రవి, పార్టీ సభ్యులు అరుణ, అంజుగా గుర్తించారు.
ఘటనా స్థలంలో ఏకే -47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మరణాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ధ్రువీకరించారు.
రవి తలపై రూ.25 లక్షలు, అరుణ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. మరో మృతుడు అంజుకు సంబంధించిన వివరాలను పోలీస్వర్గాలు వెల్లడించాల్సి ఉన్నది. మరోవైపు మిగిలిన మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలు మారేడుమిల్లి అటవీప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.
వెలిశాల నుంచి ఏవోబీ వరకు రవి పయనం..
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి చదువుకునే రోజుల్లోనే వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో చేరి కీలక నేతగా ఎదిగాడు. 1992లో పీపుల్స్వార్ ఏర్పడిన తర్వాత దానిలో చేరాడు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. పార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సేవలందించాడు.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. మావోయిస్టు పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగాడు. 2003లో నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై అలిపిరి వద్ద మావోయిస్టులు క్లుమైర్ మైన్స్ ప్రయోగించారు. పేలుడు సంభవించినప్పటికీ చంద్రబాబు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో రవికి సంబంధం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే కాక పలు విధ్వంసకర ఘటనలతో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి మావోయిస్టులతో నిర్వహించిన శాంతిచర్చలకు రవి పార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహించాడు. చనిపోయే నాటికి ఆయన వయసు 62 ఏళ్లు. రవి సోదరుడు ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య, అతని భార్య రూప కూడా గతంలో జరిగిన ఎన్కౌంటర్లలో మృతిచెందారు.
రవి భార్య జిలాని మేఘం అలియాస్ జమీల కూడా ఎదురుకాల్పుల్లోనే మృతిచెందింది. గాజర్ల రవి సోదరుడు అయితు అలియాస్ గాజర్ల అశోక్ కొన్నేళ్ల క్రితం మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి కలిశాడు. ప్రస్తుతం ఆయన భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్నాడు.
అరుణ ఎవరంటే..
ఎన్కౌంటర్లో మృతిచెందిన రవి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. రెండున్నర దశాబ్దాల క్రితం ఆమె మావోయిస్టు పార్టీ ఉద్యమంలోకి వచ్చింది. ఈమె మావోయిస్టు పార్టీ నేత చలపతిరావు సహచరి. చలపతిరావు ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు.
అరుణ కొద్దిరోజులుగా అనారో గ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిసింది. అరుణ తల్లి మావి కూడా మావోయి స్టు సభ్యురాలే. ఆమె పేరు మావి. ఈమె గత ంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందింది. అరుణ సోదరుడు ఆజాద్ మావోయి స్టు పార్టీ గాలికొండ ఏరియా కమాండర్గా పనిచేశాడు. 2015లో కొయ్యూరులో జరిగి న ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.
సెంట్రల్ కమిటీలో మిగిలింది 16 మందే..
21 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీ రూపుదిద్దకున్నప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు 42 మంది ఉండేవారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది సభ్యులే మిగిలినట్లు సమాచారం. వీరిలో ఏపీ, తెలంగా ణకు చెందిన వారే 11 మంది కాగా, జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు ఉన్నారని సమాచారం.
ఏపీ, తెలంగాణకు చెందిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి పార్టీలో పెద్ద నేతలు. కేంద్ర కమిటీ సభ్యులంతా 60 ఏళ్లకు పైబడినవారేనని సమాచారం.