06-06-2025 12:50:32 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): భారత్లో స్వదేశీ సైనిక జెట్ల ఉత్పత్తి పరంపరలో మరో ముందడుగుపడింది. 2028 ఆర్థిక సంవత్సరంలోపు హైదరాబాద్లో రఫేల్ ఫైటర్ జెట్ల ఫ్యూజ్లేజ్ తయారీ కేంద్రం అందుబాటులోకి రానున్నది. తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఫ్రాన్స్కు చెందిన ఎయిరోస్పేస్ దిగ్గజం డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థలు ఈ మేరకు కేం ద్రప్రభుత్వంతో నాలుగు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల ఫూజ్లేజ్లు మొదటిసారి ఆ దేశానికి వెలుపల తయారవుతుండటం ఇదే తొలిసారి. వాటి తయారీకి ఆయా సంస్థలు హైదరాబాద్ను ఎంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఫైటర్ జెట్ల ఫ్యూజ్లేజ్ తయారీని బలోపేతం చేయడంలో గొప్ప ముందడుగు పడిందని అభి ప్రాయపడ్డారు.
భారత ఎయిరోస్పేస్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఏర్పాటు కానున్న కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో టీఏఎస్ఎ ల్తో తమ సంస్థ భాగస్వామ్యాన్ని పంచుకోవడం ఆనందాన్నిస్తున్నదని వెల్లడించారు. టీఏఎస్ఎల్ సీఈవో, ఎండీ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ..
స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో భారత్ ముందడుగు వేస్తున్నదని, దీనిలో భాగంగానే హైదరాబాద్లో రాఫేల్ ఫ్యూజ్లేజ్ తయారీ కేంద్రం అందుబాటులోకి రానున్నదన్నారు. ఎయిరోస్పేస్ రంగంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందనడానికి ఫ్యూజ్లేజ్ తయారీ కేంద్రమే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రం ద్వారా అంతర్జాతీయంగా భారత్ ఘనత మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు.