calender_icon.png 8 June, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రాజగోపాల్ రెడ్డి

07-06-2025 08:37:04 PM

కాంగ్రెస్ బిఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం అప్పులపాలు..

బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా.నాగం వర్షిత్ రెడ్డి..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని, ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేసి గెలిచిన ఎమ్మెల్యే మద్యపానం నిషేధం చేయించానని చెప్పుకోవడం విడ్డూరమని బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి(BJP District President Dr. Nagam Varshith Reddy) అన్నారు.

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జై హింద్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సుర్విరాజు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బిజెపి మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాకారం దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని,అయోధ్య రామ మందిర నిర్మాణం,370 ఆర్టికల్ రద్దు,సర్జికల్ స్ట్రైక్,ఆపరేషన్ సిందూర్ లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలిపారని అన్నారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రం గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అప్పుల పాలు చేసి పాలనను అటకెక్కించారని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, ఎన్నికలలో విచ్చలవిడిగా మద్యాన్ని,డబ్బులను పంపిణీ చేసి గెలిచిన రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులను బందు చేపించానని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలంలో కొన్ని దశాబ్దాలుగా సాగునీరు లేక ఈ ప్రాంత ఈ మండల రైతులు, రైతు కూలీలు హైదరాబాద్ కు వలస వెళ్లి జీవనోపాధి గడుపుతున్నారని, నారాయణపురం మండలంలో అనేక గ్రామాలకు లింకు రోడ్లు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు మార్చి అర్హులైన పేదలకు లబ్ధిదారులుగా గుర్తించకుండా  ఇండ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా నెరవేర్చలేమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని ఆయన అన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, మండల ఇన్చార్జి,జిల్లా ఉపాధ్యక్షులు  సోమ నరసింహ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం వేణు, జిల్లా నాయకులు భాస్కర నరసింహ గౌడ్, వంగరి రఘు,సూరపల్లి శివాజీ, నందగిరి జగత్ కుమార్ ,గూడూరి మంజునాథ్ రెడ్డి,ఉష్కగుల గిరి,తదితరులు పాల్గొన్నారు.