14-06-2025 02:43:24 PM
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం AI-171 విషాదకరమైన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఘటనలో 274 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. విమానయాన భద్రతపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన వెంటనే సహాయబృందాలతో పాటు ఉన్నతాధికారులు బృందమంతా రెండు గంటల్లో ఘటనాస్థలికి చేరుకున్నాయన్నారు.
గుజరాత్ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ తక్షణమే స్పందించి మంటలార్పి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిందని పౌర విమానయానశాఖ మంత్రి తెలిపారు. ప్రమాద స్థలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయంత్రం 6 గంటల వరకు మంటలార్పేసిందన్నారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు. ఆ బాధ అర్థం చేసుకోగలనని రామ్మోహన్ నాయుడు వాపోయ్యారు. ఈ దుర్ఘటనను పౌరవిమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీ వేశామని, అవసరమైతే మరికొంతమంది సభ్యులనూ బృందంలో చేరుస్తామని ఆయన వెల్లడించారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తోందని రామ్మోహన్ వివరించారు.
బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలుసుకునేందుకు తామే ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారని ఆయన స్పష్టం చేశారు. 787 సిరిస్ ను తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశించామని, నిపుణుల విచారణ పూర్తయ్యాక తగిన సమయంలో మీడియాకు సమాచారమిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు చేస్తున్న చిరుసాయం కాస్త ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాళ్లకు కలిగిన నష్ట్రాన్ని ఎవరూ పూడ్చలేనిదని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబాలను మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు.