నాగోబా ఆలయాభివృద్ధికి రూ.21కోట్లు మంజూరు
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, సెప్టెంబర్ 3: ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబ ఆలయ(Nagoba temple) అభివృద్ధికి ప్రభుత్వం రూ. 21 కోట్లు మంజూరు చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ అనంతరావు, మెస్రం వంశస్థులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణం, ఆలయ ముఖద్వారం అభివృద్ధి, కోనేరు పొడిగింపు, గార్డెన్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మెస్రం వంశస్థులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






