24 March, 2026 | 11:46 PM

సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

24-03-2026 10:08 PM

* ఏప్రిల్ 1 నుంచి నుంచి 3 వరకు జాతర

* గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భక్తులు సలేశ్వరం జాతరకు రావద్దు 

* జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే సలేశ్వరం జాతరను ఏప్రిల్ నెల 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, డిఎఫ్ఓ రేవంత్ చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలన్నారు. మూడు  రోజుల పాటు భక్తులను అనుమతిస్తున్నట్లు, ఫారహాబాద్ నుంచి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాద వశాత్తు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అటవీ శాఖ సిబ్బందితో కలిసి పోలీస్ శాఖ  గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలి.

రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మధ్య మధ్యలో సోలార్ లైట్లును ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం విరివిగా బస్సులను ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ డిఎంను కలెక్టర్ ఆదేశించారు. వైద్య శాఖ తరపున పలు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందీని, అంబులెన్స్ లను 24 గంటలు పర్యవేక్షణ జరిపేలా ఏర్పాటు చేయాలని  కింద గుండం దగ్గర వైద్య సిబ్బంది అన్ని రకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉండాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. 

అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని, వేసవి కాలంలో కావున భక్తులకు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్ డబ్ల్యూయస్ ఈఈకి సూచించారు. సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, వాహనాల అనుమతి తదితర అంశాలను పోలీస్, ఫారెస్ట్  అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా అడవిలో ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలి.

రెండు రోజుల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తాను కూడా పర్యటించి, పకడ్బందీ ఏర్పాట్లు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సలేశ్వరం జాతరకు గర్భిణీ మహిళలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు సలేశ్వరం జాతరకు రాకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ... జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని టాపిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అధికారులు కమిటీ సభ్యులు చెంచు సంఘాల నాయకులు పోలీస్ శాఖకు సహకారాలు అందించాలని, సలేశ్వరం జాతరను అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు.