24-06-2025 12:33:55 AM
విధ్యుత్ కోతలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సోమవారం సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడ విధ్యుత్ లేకపోవడంతో ప్రతిరోజు ఇలాగే అవుతుందా అని రోగులను అడగగా రోజు ఇలాగే పోతుందని తెలిపారు.
జ్వరంతో బాధపడుతున్న మండల కన్వీనర్ అస్లాంను పరామర్శించి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం జనరేటర్ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు కరెంట్ ఉండేదని గుర్తు చేశారు.
ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్రావు నాయకులు మనోహర్, షేక్ చాంద్, ఖాజా, సోఫీ తదితరులు పాల్గొన్నారు.