గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ
ములకలపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మోతాదుకు మించి మందులను రోగులకు అందిస్తూ వైద్యం చేస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల గ్రామీణ వైద్యులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ షోకాజ్ నోటీసులు(Show cause notices) జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలో ఆర్ఎంపీ వైద్యులపై అందిన ఫిర్యాదు మేరకు ఆయన సిబ్బందితో కలిసి ములకలపల్లి మండలంలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేశారు.
తనిఖీలలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు అధిక స్థాయి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, లోకల్ అనస్థీటిక్ ఔషధాలు, ఐవి ఫ్లూయిడ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా క్లినికల్ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం గమనించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో వైద్యం పేరిట వారు చేస్తున్న వైద్యం ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారిందని నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆరు రోజులలోపు తమ వివరణాత్మక సమాధానాలు సమర్పించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సి హెచ్ ఐ పి ఓ డా.ప్రతాప్,డిపిఎమ్ఓ మోహన్ పాల్గొన్నారు.




