ప్రతి అర్హుడికి ఓటు హక్కే ఎస్ఐఆర్ లక్ష్యం
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్కర్నూల్, మే 21 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేస్తామని చెప్పారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్ (బిఎల్ఓ) ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు చేపడతామన్నారు. ప్రతి ఓటరును బీఎల్వోలు కనీసం మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. మరణించిన వారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపుతో ఓటరు జాబితా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆ ఓటరు జాబితాలో అర్హుల పేర్లు లేని పక్షంలో ప్రత్యేక నోటీస్ జారీ చేస్తూ హియరింగ్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తారని ఆ తేదీలో పూర్తి వివరాలను కలెక్టర్ ద్వారా పంపవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశం కూడా మూడుసార్లు ఉంటుందని అర్హులైన ప్రతి ఓటరు ఎస్ ఐ ఆర్ కు సహకరించాలన్నారు.






