02-06-2025 01:46:13 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం మే నెలలో ఆరు శాతం పెరిగింది. నెల ముగిసేటప్పటికీ రూ. 5,310 కోట్ల ఆదాయం వచ్చినట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. గతేడాది మే నెలలో ఈ ఆదాయం రూ.4,986 కోట్లు ఉండగా, ఈసారి కాస్త పెరిగినట్లయింది. మరోవైపు జీఎస్టీ ద్వారా కేంద్రానికి రూ. 1,49,785 కోట్ల ఆదాయం రాగా, జాతీయ స్థాయిలో జీఎస్టీ ఆదాయం 13.66 శాతం వృద్ధి నమోదైందిది.
తెలంగాణ, ఏపీలో వృద్ధి ఇలా..
మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2.01లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 16.4శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇక వరసగా రెండోరోజూ రూ.2 లక్షల కోట్లకు మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వృద్ధి సానుకూలంగా ఉన్నప్పటికీ, తెలంగాణ, ఏపీల్లో జీఎస్టీ వసూళ్ల వృద్ధి 6శాతం వరకు ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటా ప్రకారం మే నెల స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు 2.37లక్షల కోట్ల ఆల్టైం రికార్డు నెలకొల్పిన తర్వాత మే నెలలో కూడా రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన పురోగతిని, ఆర్థిక వ్యవస్థ రికవరీని స్పష్టం చేస్తున్నది. మే నెలలో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల ఆదాయం 13.7శాతం పెరిగి సుమారు 1.50లక్షల కోట్లకు ఆదాయం చేరింది.
వసూళ్ల విభజన చూస్తే సెంట్రల్ జీఎస్టీ 35,434 కోట్లు, స్టేట్ జీఎస్టీ 43,902 కోట్లు, ఐజీఎస్టీ దాదాపు 1.09లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. వాటికి అదనంగా సెస్ వసూళ్లు కూడా రూ.12,879 కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 20.4శాతం వృద్ధిని సూచిస్తున్నది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు సానుకూ లంగా వృద్ధి ఉన్నా, రాష్ట్రాలవారీగా గణనీయమైన తేడాలున్నాయి.
డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి అభిప్రాయం ప్రకారం.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక,తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాలు 17 శాతం నుంచి 25 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో గుజరాత్, ఏపీ, తెలంగాణ వంటి కొన్ని పెద్ద రాష్ట్రాల్లో వృద్ధి ఆరు శాతం వరకు మాత్రమే నమోదైంది.