04-06-2025 12:50:25 AM
300 మంది ఉద్యోగుల తొలగింపు
న్యూఢిల్లీ, జూన్ 3: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టింది. తాజాగా 300 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమమేధ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయాన్ని సంస్థ తీసుకుందని బ్లూమ్బర్గ్ కథనాన్ని ప్రచురించింది.
ఏఐ, ఆటోమేషన్ వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు షురూ చేసింది. గతనెలలో సుమారు 6 వేల మందికి ఉద్వాసన పలికిన మైక్రోసాఫ్ట్, తాజాగా 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు.
మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు. కాగా మైక్రోసాఫ్ట్ తాజా రౌండ్లో ఏ ఉద్యోగాలను తొలగించిందో మాత్రం వెల్లడించలేదు.