26-06-2025 12:34:22 AM
ఎల్బీనగర్ లో ఒకరు అరెస్టు... మరోకరు పరారీ
ఎల్బీనగర్, జూన్ 25 : ఏనుగుల దంతాలను (దంతాలు) అక్రమంగా విక్రయిం చడానికి ప్రయత్నిస్తున్న ఒక నిందితుడిని ఎల్బీనగర్ జోన్, స్పెషల్ ఆపరేషన్స్ టీం అధికారులు, హయత్ నగర్ అటవీశాఖ రేం జ్ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుం చి రెండు ఏనుగుల దంతాలు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్ లో సుమారు రూ, 3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాల యంలో బుధవారం పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలానికి చెందిన రేకులకుంట ప్రసాద్ (32) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే, వచ్చే సంపాదన సరిపోకపోవడంతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో సులభంగా డబ్బు సంపాదించే వాడు.
గతంలో ఇతడు ఎర్రచందనం స్మగ్లిం గ్ కేసులో తిరుపతి జిల్లాలోని ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ (రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్) పోలీసులు అరెస్టు చేసి, ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి సబ్-జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు లోకే శ్వర్ రెడ్డిని కూడా అదే జైలులో ఉంచారు. వారిద్దరూ జైలులో స్నేహితులుగా మారి, జైలు నుంచి విడుదలైన తర్వాత ఏనుగు దం తాలను భారీ లాభాలకు విక్రయించాలని పథకం వేశారు.
పథకం ప్రకారం లోకేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శేషాచలం అడవికి వెళ్లి అక్కడ రెండు ఏనుగు దంతాలను సేకరించాడు. ఈ ఏనుగు దంతాలను హైదరాబాద్లో అధిక ధరకు అమ్మాలని ప్రసాద్తో కలిసి హైదరాబాద్ కు వెళ్లడానికి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కారు. 25వ తేదీ బుధవారం ఉదయం ఎల్బీనగర్ చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం, హయత్ నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ప్రసాద్ను అరెస్టు చేసి, అతడి నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి తప్పించుకున్నాడు. అంతరించిపోతున్న జంతువులను రక్షించాలని, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సుధీర్ బాబు కోరారు. సమావేశంలో ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్వోటీ అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, హయత్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాయి ప్రకాశ్పాల్గొన్నారు.