24-03-2025 08:10:18 PM
ఎస్సై రాజేష్..
బూర్గంపాడు (విజయక్రాంతి): క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని ఇది ఆర్థికంగా, సామాజికంగా జీవితాలను నాశనం చేస్తుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. క్రికెట్ బెట్టింగ్ల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉండడంతో పాటు కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలని కోరారు. మండల వ్యాప్తంగా బెట్టింగ్ లపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని కావునా పిల్లలపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బెట్టింగ్ కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని, డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.