21-10-2025 07:14:23 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్..
వనపర్తి: ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు బుధ, గురువారాల్లో ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ తన ఛాంబర్ లో పీపీసీల ఏర్పాటు, పీపీసీల ఇన్చార్జిలకు శిక్షణకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓల ఆధ్వర్యంలో పీపీసీల ఇన్చార్జి లకు ఎఫ్ ఎ క్యూ ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని గుర్తించడం, తేమ శాతాన్ని నిర్ధారించడం, సన్న దొడ్డు రకాలను గుర్తించడం వంటి అంశాలపై సరైన అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ పంట వచ్చే సమయానికి అనుకూలంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా గత సీజన్లో ఏర్పాటుచేసిన సన్న దొడ్డు ధాన్యం కేంద్రాల వివరాలను పరిశీలించి ఈసారి ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డిసిఓ రాణి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.