8 July, 2026 | 4:27 PM

బాన్సువాడ ఎస్సీ హాస్టల్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

08-07-2026 03:25 PM

పత్తాలేని వార్డెన్... సిబ్బంది

వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు ధర్నా

సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో, డీఎస్పీ

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ ఇంటర్మీడియట్ వసతిగృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అమృత (18) వసతి గృహంలోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని అమృత డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిందని వారు తెలిపారు. అమృత బుధవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిందనీ ఆ తర్వాత గమనిస్తే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి డి.ఎస్.పి విట్టల్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్య గల కారణాల పై విచారణ చేపట్టారు. అయితే రాత్రి నుంచి వసతి గృహ వార్డెన్ పత్తా లేకుండా పోయిందని ఎన్ని రోజుల నుండి రావడం లేదు తెలవడం లేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలిసి కూడా వసతి గృహానికి రాకపోవడంపై విద్యార్థిని తల్లిదండ్రులు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం తల్లిదండ్రులు వసతి గృహానికి వచ్చిన వార్డెన్ సిబ్బంది ఎవరు కూడా వసతి గృహంలో లేరు అని పత్తా లేకుండా పోయారని తమ కూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలపాలని వారు డిమాండ్ చేశారు.అయితే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు ఎస్సీ వసతి గృహం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాల పై సమగ్ర విచారణ చేపట్టాలని వసతి గృహంలో పత్తా లేకుండా పోయిన వార్డెన్ పై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వసతి గృహం ముందు కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

డీఎస్పీ ఆర్డీవోలు విద్యార్థిని మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో టిఆర్ఎస్ నాయకులు ధర్నా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ అక్బర్, కౌన్సిలర్ ఖలీల్ విద్యార్థి సంఘాలు తదితరులున్నారు.