ఢిల్లీ సౌత్ ఆసియా యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ
శివరాత్రి రోజున మాంసాహారం వడ్డించడమే గొడవకు కారణం
ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ పరస్పర దాడులు
వీడియో ద్వారా విషయం వెలుగులోకి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సౌత్ ఆసియా యునివర్సిటీలో (ఎస్ఏయూ) విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహాశివరాత్రి పర్వదినాన మెస్లో మాంసాహార వంటకాన్ని వడ్డించడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ సంఘాలకు చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మైదాన్గర్హి పోలీస్ స్టేషన్కు పీసీఆర్ కాల్ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం యూనివర్సిటీలో గొడవ పడుతున్న విద్యార్థుల ఘర్షణకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విషయంలోకి వెళితే.. బుధవారం సౌత్ ఆసియా యునివర్సిటీలో మధ్యాహ్నం మెస్లో విద్యార్థులకు మాంసాహారం వడ్డించారు. అయితే అక్కడే ఉన్న ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు శివరాత్రి రోజున మాంసాహారం తినడమేంటని మహిళా విద్యార్థిని ప్రశ్నించారు. మాటా మాటా పెరిగి విద్యార్థినిపై దాడికి దిగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎస్ఎఫ్ఐ బృందం ఏబీవీపీ విద్యార్థులతో ఘర్షణకు దిగడంతో గొడవ పెద్దదైంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక విద్యార్థి తన సెల్ఫోన్లో బంధించి సామాజిక మాధ్యమంలో షేర్ చేశాడు. అయితే పండుగ రోజున ఉపవాసమున్న విద్యార్థులకు మెస్లో అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేశామని ఏబీవీపీ తెలిపింది. అయితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కావాలనే బలవంతంగా మాంసాహారం వడ్డించారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం.. నాన్ వెజ్ ఫుడ్ తింటున్న విద్యార్థులపై గుండాగిరి ప్రదర్శించారని.. అడ్డు వచ్చిన మెస్ నిర్వాహకులపై కూడా ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారంటూ ఏబీవీపీ ఆరోపణలను తిప్పికొట్టింది. కాగా దాడిలో గాయపడిన మహిళా విద్యార్థిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.






