calender_icon.png 9 June, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయంకర డ్రోన్ల యుద్ధం!

04-06-2025 12:00:00 AM

యుద్ధ క్షేత్రాల్లో డ్రోన్లు ఇప్పుడు ఆధునిక సైనిక ఆయుధాలుగా మారాయి. జూన్ 1న కనీవినీ ఎరుగని రీతిలో రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో జరిపిన దాడి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. చెక్క పెట్టెల్లో రష్యాలోకి దొంగచాటుగా తరలించిన 117 డ్రోన్లతో ఉక్రెయిన్ బీభత్సం సృష్టించింది. రష్యా భూభాగంలో వైమానిక స్థావరాల ను లక్ష్యంగా చేసుకొని ఏడాదిన్నర పాటు ఒక పథకం ప్రకారం ఉక్రెయిన్, రష్యాకు అపారమైన నష్టాన్ని కలిగించింది. ఉక్రెయిన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు కూడా చొచ్చుకు రానంత దూరం దాదాపు 8 వేల కిలోమీటర్ల సుదూరంలోని లక్ష్యాలను డ్రోన్లు తాకాయి. 

రష్యాలోని అయిదు ప్రాంతాల్లోని వైమానిక స్థావరాల వద్ద ఆగిన లారీల నుంచి మిడతల దండులా కదిలిన డ్రోన్ల దాడికి క్రెమ్లిన్ కలవర పడింది. నాలుగేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాలు డ్రోన్లను విరివిగానే ఉపయోగిస్తున్నాయి. కాని తాజాగా జరిగిన ఈ దాడి, రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసిన ‘పెరల్ హార్బర్’ ఘటనను పోలి వున్నదని రష్యా చెపుతున్నది.

రష్యా మిలటరీకి ఇది పెద్ద దెబ్బ. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ పేరుతో ఉక్రెయిన్ చేసిన ఈ దాడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. డ్రోన్ల దాడి తర్వాత మరుసటి రోజే ఇస్తాంబుల్‌లో రెండు దేశాలమధ్య జరిగిన రెండో దఫా చర్చలు అంతా ఊహించినట్టుగానే ఫలించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం నెరపినా యుద్ధ విరమణ సరికదా, కాల్పుల విరమణ కూడా సాధ్యపడలేదు.

41 యుద్ధ విమానాలు కోల్పోయిన రష్యా ఇప్పుడు కుతకుతలాడుతున్నది. ఉక్రెయిన్ జరిపిన దాడిని, అమెరికా పెరల్ హార్బర్‌పై జపాన్ చేసిన వైమానిక దాడితో పోలుస్తున్న రష్యా, మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేపుతుందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ తన మొండి వైఖరి ఒకవైపు, అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో రష్యా నడ్డి విరుస్తామన్నట్లుగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినిస్కీ ధోరణి మరోవైపు రెండు దేశాల మధ్య యుద్ధం పరిసమాప్తమయ్యే పరిస్థితులను మృగ్యం చేస్తున్నాయి.

సంప్రదాయేతర యుద్ధ పద్ధతులకు దూరంగా, ఆధునిక డ్రోన్లతో సాగుతున్న ఈ యుద్ధం రెండు దేశాలకు అపార నష్టం కలిగిస్తున్నది. గూఢచర్యానికి, అనేక రంగాల్లో చేదోడు వాదోడుగా ఉంటాయనుకున్న డ్రోన్లు, ఇప్పుడు మిలటరీ ఆయుధాలుగా రూపాంతరం చెంది భద్రతకు పెను సవాళ్లు విసురుతున్నాయి. 

ఇటీవలి మన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన దాడులను తుర్కియా తయారీ డ్రోన్లనే ఎక్కువగా ఉపయోగించింది. ఈ పరిస్థితుల్లో ఇబ్బడి ముబ్బడిగా భారత్ కూడా డ్రోన్లను అభివృద్ధి పర్చుకో వడం అవసరం. కొన్ని వేల రూపాయల వ్యయంతో సమకూర్చుకొనే డ్రోన్, కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే బాంబర్ విమానంతో సమానమవుతుంది. రాడార్లు కూడా పసిగట్టలేని ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు ఇప్పుడు మిలటరీ ఆయుధాలుగా మారాయి.