21-06-2025 02:28:47 AM
హీరోయిన్గా రాణించడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే.. ఎవరైనా ఏం చెప్తారు? యాక్టింగ్ టాలెంట్ ఉండాలనో.. లేదంటే ప్రేక్షకుల్ని రప్పించగలిగే గ్లామర్ కూడా హీరోయిన్గా ఎదగడానికి అవసరం అనో చెప్తారు. చాలా మంది నమ్మేది కూడా ఇదే! కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందంటోంది శివాత్మిక రాజశేఖర్. హీరో రాజేశేఖర్ తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ శివాత్మిక కథానాయికగా ఐదు సినిమాలు చేసింది.
2019లో దొరసాని అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమధ్య తమిళంలోనూ ఓ రెండు చిత్రాల్లో చేసింది. తర్వాత మళ్లీ తెలుగులో 2022లో ‘పంచతంత్రం’, 2023లో ‘రంగమార్తాండ’ సినిమాల్లో నటింంది. కొత్త ప్రాజెక్టులేవీ శివాత్మిక చేతిలో ఉన్నట్టు అధికారిక ప్రకటనలేవీ వెలువడలేదు. అయితే, సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా శివాత్మిక చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సినిమాల్లో ఛాన్సుల కోసం తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది శివాత్మిక. “ఇన్స్టాలో ఫాలోవర్స్ లేరని నన్ను కొన్ని సినిమాల నుంచి తీసేశారు.
ఇలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా సార్లు ఎదుర్కొన్నాను. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న కొందరికి అవకాశమిచ్చారు. ప్రస్తుతం ఏ మేనేజర్, ఏజెంట్ను కలిసినా సరే ఇన్స్టాలో ఫాలోవర్స్ను పెంచుకోమంటున్నారు” అని చెప్పిన శివాత్మిక.. తానొక నటినని.. కంటెంట్ క్రియేట్ చేయడం తన పని కాదు కదా! అంటోంది.