11-02-2026 01:15:35 AM
డెహ్రాడూన్, ఫిబ్రవరి 10: అయోధ్యలో ఎప్పటికీ బాబ్రీ మసీదు పునఃనిర్మాణం జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆ కలలు కనేవారుంటే, వారి కలలు కల్లలుగానే మిగిలి పోతా యని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంచల్లోని హరిద్వార్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముందు నుంచి అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్తూ వచ్చిందని, ఆ కలను నిజం కూడా చేసిందని గుర్తుచేశారు.
భారత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, ఈ దేశానికి సనాతన ధర్మమే గర్వకారణమని కొనియాడారు. ఒక దేశ ప్రధాని మోదీ రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేయడం, సనాతన ధర్మానికి అసలైన ప్రతీక అభివర్ణించారు. కొందరు స్వార్థపరులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే రాముడిని తలుచుకుంటారని విమర్శించారు. అలాంటి వారిని భగవంతుడు సైతం మర్చిపోతాడని తెలిపారు.
చట్టాలను గౌరవించే వారు మాత్రమే ప్రశాంత ఉండగలుగతారని, నిబంధనలు అతిక్రమించే వారికి నరకం తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి స్వర్గానికి వెళ్లాలని చూసే వారి, దేవుడు ఉపేక్షించడని పేర్కొన్నారు. సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్ అల్లర్లతో అట్టుడికేదని, తమ పాలనలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.