14-06-2025 08:56:32 PM
విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది..
ఎన్ హెచ్ఆర్సి రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పోరిక రవీందర్..
ములుగు (విజయక్రాంతి): గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 290 మంది దుర్మరణం చెందడం పట్ల యావత్ దేశం దిగ్బ్రాంతికి గురైందని జాతీయ మానవ హక్కుల కమిటీ(National Human Rights Commission) రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పోరిక రవీందర్(Dr. Porika Ravinder) విచారం వ్యక్తం చేశారు. హాస్టల్ మెస్ పై కూలడం వల్ల 50మంది వైద్య విద్యార్థులు, 240 మంది ప్రయాణికులు మొత్తం 290 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మాటలకందని విషాదమని ఆయన అన్నారు. వైద్య విద్యార్థుల మరణం ఈ దేశానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు ఉన్న భవనంపై విమానం కుప్పకూలడంతో ప్రాణాలు కాపాడడానికి వైద్య వృత్తిని చదువుతున్న కాబోయే డాక్టర్లు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. విమాన ప్రమాద దుర్ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పెట్టేం రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు,ములుగు మండల అధ్యక్షులు వీరమల్ల రాము,ములుగు పట్టణ అధ్యక్షురాలు ఉప్పుల కోమల తదితరులు పాల్గొన్నారు.