దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మాజీ మంత్రి... ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి... ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు... రైతులను ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న, కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను మేయర్ కోలగాని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదని అన్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.






