02-02-2026 01:02:36 AM
బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్కుమార్
అబ్దుల్లాపూర్మెట్, ఫిబ్రవరి 1: జాతరపై అగ్ర కులాల చేసే రాజకీయ కుట్రను ఆపాలని బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అన్నారు. గ్రామంలో జరగనున్న శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి 44వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించే జాతర నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగిందని.. దీనిని వ్యతిరేకిస్తూ ఆదివారం సర్పంచ్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. విజయ్కుమార్ మాట్లాడుతూ.. అధికార బలంతో స్థానిక కాంగ్రెస్ నేతలు జాతర నిర్వహణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభ తీర్మానం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీన నోటీసును పెట్టి .. వెనువెంటనే ఆ నోటీసులు తొలగించి వేసి.. అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎలాంటి అధికారం లేకపోయినా.. జాతర నిర్వహించి.. అగ్రవర్ణ నాయకులు.. దళిత (ఎస్సీ) కులానికి చెందిన సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జాతరను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 20 ఏండ్లుగా ఏ విధంగా జాతర నిర్వహించారో.. అదే విధంగా గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని తెలిపారు. జాతరలో రాజకీయ చిచ్చుపెట్టి.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని గ్రామ ప్రజల కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు కన్నె భరత్, ఏడవల్లి సుస్మిత రమేష్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవాని శివ తదితరులున్నారు.