ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలి
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల, మే 14,(విజయక్రాంతి)రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, సామరస్య వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హిందూ సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
1977 గోవధ నిరోధక చట్టం, 1978 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్, 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల రవాణాపై అనుమానాల పేరుతో రోడ్ల దిగ్బంధనలు లేదా ఘర్షణాత్మక పరిస్థితులు సృష్టించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు అవసరమైతే రౌడీ, సస్పెక్ట్ షీట్లు కూడా తెరవబడతాయని తెలిపారు.
గత ఏడాది రెండు కేసులు నమోదు చేసినట్లు గుర్తుచేశారు.పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్లైన్ 8712537826, నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నంబర్ 8712656410లకు సమాచారం అందించాలని కోరారు.సీజ్ చేసిన పశువుల సంరక్షణ కోసం జిల్లాలో 9 ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడ వెటర్నరీ వైద్యులు, మేత, నీటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఎస్ఐ శ్రీకాంత్తో పాటు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






