calender_icon.png 22 May, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే నెంబర్ 332లో ప్రభుత్వ స్థలం కబ్జా..

22-05-2025 06:06:24 PM

ఆలయ కమిటీ ముసుగులో యథేచ్ఛగా షెటర్స్ వేసి అద్దెలకిస్తున్న వైనం..

ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టడంలో విఫలమవుతున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఆలయ కమిటీ ముసుగులో స్థానికులు చేస్తున్న దందా నిజాంపేట్(Nizampet)లో ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. దేవుడి కోసమేనంటూ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన నేతలు ప్రస్తుతం గుడి, గుడిలోని లింగాన్ని మింగే మాదిరిగా తయారయ్యారనేది నగ్న సత్యం. నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో విలువైన ప్రభుత్వ స్థలం శ్రీ మల్లిఖార్జున, భ్రమరాంభిక దేవి, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం కోసం గతంలో తమకు తామే రెవెన్యూ యంత్రాంగంకు ఏ మాత్రం సంబంధం లేకుండా కేటాయించుకున్నారు.

బాచుపల్లి మండలంలోని నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో గల ఈ స్థలం సుమారు రెండు ఎకరాలు వరకు ఉంటుంది. ఈ స్థలం విలువ ప్రస్తుతం వందల కోట్లు పలుకుతుంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ స్థలం కేవలం దేవుడికే అంటే ఎట్లా నాయకుల జేబులోకీ కూడా వెళ్ళాలి కదా అనుకున్నారు. ఇక్కడి పలుకుబడి ఉన్న నాయకులు.అన్ని పార్టీల నాయకులు ఏకమై తలా పాపం తిలా పిడకెడు అనేలా గేట్లు వేసుకుని మరీ పంచుకున్నారు.

ఆలయ ప్రహరీని ఆనుకుని ఉన్న ప్రధాన రోడ్డు పై ఉండే స్థలాలను తమ ఆదీనంలోకి తీసుకుని ధర్జాగా షెటర్స్ వేస్తూ లక్షలు రూపాయలు అప్పనంగా అర్జీస్తున్నారు. దేవుడి గుడికే శఠగోపం పెట్టేలా ఇక్కడి పాలకవర్గం చేస్తున్న తీరుతో ఆలయానికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేక, పార్కింగ్ వసతులు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, రెవిన్యూ ఎన్ ఓ సీ లు లేకుండా ప్రభుత్వ స్థలంలో భారీ షెటర్స్ నిర్మించి ప్రతి నెల వేల రూపాయలకు అద్దెలకు ఇస్తూ ప్రభుత్వ ఆస్తులను, దేవుడి మాన్యాలను దోచుకుంటున్నారు.

గిరిదావర్ కి చెప్పాను... యాక్షన్ తీసుకుంటా..

బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్...

నిజాంపేట్ సర్వే నెంబర్ 332 లో అక్రమంగా వెలసిన షెటర్స్ విషయంపై బాచుపల్లి తహసీల్దార్ ను వివరణ కోరగా... తాను కోర్టు పనిమీద బయటికీ వచ్చానని ఆర్ఐ కి చెప్పాను. తప్పకుండ అక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను విచారించి కూల్చివేస్తామని తెలిపారు.

జేసీబీ దొరకలేదు.. వచ్చి ఇల్లీగల్ షెటర్స్ కూల్చేస్తాం..

రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్..

సర్వే నెంబర్ 332 లో జరిగిన అక్రమ షెటర్స్ విషయంపై ఆర్ఐ భానుచందర్ ను సంప్రదించగా తనకు జ్వరం వచ్చిందని, తాను రెవెన్యూ స్టాఫ్ అందరికి వడదెబ్బ తగిలింది అన్నారు. సోమవారం జేసిబీ సహాయంతో తప్పకుండ అక్రమ షెటర్స్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.