2036 నాటికి 50 పతకాలే లక్ష్యంగా
పీసీఐ అధ్యక్షుడు దేవేంద్ర ఝఝరియా
న్యూఢిల్లీ: 2036 పారాలింపిక్స్ నాటికి భారత్ 50 పతకాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝరియా అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ భారత్లో సాధ్యమైతే పారాలింపిక్స్లో భారత్ అద్భుత ప్రదర్శనతో పతకాల పట్టిలో టాప్ నిలిచే అవకాశముందని తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం పారాలింపిక్స్లో భారత్ ఒక్క పసిడి మాత్రమే సాధించింది. టోక్యోకు వచ్చేసరికి ఆ సంఖ్య ఐదుకు చేరగా.. 19 పతకాలు వచ్చి చేరాయి. ఇక పారిస్లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం.
2032లో పతకాల సంఖ్య 30 నుంచి 40కి చేరొచ్చు. ఇక 2036లో భారత్ పారాలింపిక్స్కు ఆతిథ్యమిస్తే మాత్రం కచ్చితంగా 50 పతకాలతో టాప్ చోటు సాధించే అవకాశముంది’ అని చెప్పుకొచ్చారు. లుసాన్నే మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా ప్రదర్శనపై దేవేంద్ర స్పందిస్తూ.. ‘వచ్చే రెండేళ్లలో నీరజ్ 90 మీటర్ల మార్క్ను దాటుతాడు. జావెలిన్ను 93 మీటర్లు విసిరి రికార్డులను బద్దలు కొట్టబోతున్నాడు..సిద్ధంగా ఉండండి’ అని పేర్కొన్నారు.
ఇక పారాలింపిక్స్లో జావెలిన్ త్రో ఎఫ్ 46 కేటగిరీలో రెండుసార్లు (2004, 2016) స్వర్ణ పతకాలు నెగ్గిన దేవేంద్ర ఝఝరియా 2021 టోక్యోలో రజతం సాధించాడు. ఇక భారత పారా షూటర్ల బృందం శనివారం పారిస్కు బయల్దేరి వెళ్లింది. అవనీ లేఖరా, మోనా అగర్వాల్, నర్వాల్ సహా తదితరులు ఆగస్టు 30 నుంచి షూటింగ్ ఈవెంట్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో పారాలింపిక్స్లో షూటింగ్ విభాగంలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. ఈసారి పారాలింపిక్స్లో భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 82 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.




